అసెంబ్లీలో అమరావతి తీర్మానం వేళ పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం

  • టెంట్ వేసుకునైనా ఏపీని అభివృద్ది చేద్దామని చంద్రబాబు చెప్పారన్న పవన్
  • రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం గొప్ప విషయమని వ్యాఖ్య
  • రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతారహితంగా వ్యవహరించిందని విమర్శ

రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో చంద్రబాబును కలిసినప్పుడు, "టెంట్ వేసుకునైనా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేద్దాం" అని ఆయన అన్న మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. అనుభవజ్ఞుడైన నేత చేతిలో రాష్ట్రం ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే, 2014లో ఎటువంటి షరతులు లేకుండా తాను మద్దతు ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ఒక బలమైన ఆశావాదిలా పనిచేశారని కొనియాడారు.


సాధారణంగా భూసేకరణ అంటే ఎన్నో గొడవలు, అడ్డంకులు ఉంటాయని, కానీ అమరావతి కోసం రైతులు ఎటువంటి గొడవలు లేకుండా స్వచ్ఛందంగా భూములివ్వడం ఒక గొప్ప విషయమని పవన్ పేర్కొన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన వారందరికీ న్యాయం చేసేలా అప్పట్లోనే అడుగులు పడ్డాయని ఆయన వివరించారు.


2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై అభాండాలు వేశారని, రాజధాని మహిళా రైతులను రోడ్లపై దారుణంగా కొట్టారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ ఇల్లు వదిలి బయటకు రాని ఆడవాళ్లు సైతం రాజధాని కోసం రోడ్డుపైకి వచ్చి పోరాడాల్సిన దుస్థితి కల్పించారని మండిపడ్డారు. గత పాలనలో చట్టసభల్లో దాడులు జరిగాయని, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకే రక్షణ లేని 'యుద్ధ వాతావరణం' ఉండేదని ఆయన గుర్తుచేశారు.


రాష్ట్రాన్ని విభజించినప్పుడు కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని, దాని వల్లే ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పవన్ విమర్శించారు. "తెలంగాణ, ఆంధ్ర వేర్వేరు అనే భావన మాకు ఎప్పుడూ లేదు.. మా దృష్టిలో తెలుగు నేల ఒక్కటే" అని ఆయన ప్రకటించారు. అమరావతికి కల్పిస్తున్న ఈ చట్టబద్ధత భవిష్యత్తు తరాలకు ఒక భరోసా అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Pawan Kalyan
Amaravati
Andhra Pradesh
Chandrababu Naidu
AP Assembly
Capital City
Farmers
State Division
Telugu Land

More Telugu News